లాహిరి లాహిరి లాహిరిలో...


ఉప్పొంగే సముద్రం... ఉరకలు వేసే అలలు... ఉత్సాహంగా ఎగిరిపడే చేపల వలలు... ఊరంతా కడలి మీదే ఆధారపడి బతికే అమాయక ప్రజలు... 
ఆ మధ్యలో మండే అగ్నిగోళాల్లా ఇద్దరు పెద్దలు... 
ఒకరు నరసింహ - మరొకరు దేవరాజ్‌. ఇద్దరి మధ్య వైరం నీటిలో కూడా మంటలు పుట్టిస్తుంది. šపెను విధ్వంసాలను సృష్టిస్తుంది. నరసింహను చూస్తే ఊళ్లో ఒక వర్గమంతా తలవంచి నమస్కరిస్తారు. మరో వర్గం ఎప్పుడు తలలు తెగనరుకుతాడా అని భయంతో వణుకుతారు. కానీ ఆ నరసింహ మనసు మాత్రం ఎప్పుడూ తన ఇద్దరు కూతుళ్లమీదే. వాళ్లే... లహరి, అక్షర! నగరంలో చదువుకుని వచ్చిన అందమైన అమ్మాయిలు. ఒకరికి పట్టుదల ఎక్కువ, మరొకరికి  ప్రేమాభిమానాలు ఎక్కువ. 
చిరుగాలిలో చల్లగా సాగే తెరచాప పడవలాంటి వాళ్ల జీవితం అకస్మాత్తుగా ఓ పెను తుపానులో చిక్కుకుంది. నివ్వెరపోయి తేరుకునేలోగానే ఆ అక్కాచెల్లెళ్ల దారులు వేరువేరయ్యాయి. 
విధి శాసించిన వింత కథలో నాన్న అనురాగాన్ని మరచిపోలేక, జరిగిన విషాదాన్ని దిగమింగు  కోలేక ఆ ఆడపిల్లలు ఇద్దరూ ఏం చేశారు? ఎలా అడుగు ముందుకు వేశారు? 
అనుక్షణం ఉత్కంఠతో సాగే ధారావాహిక ‘లాహిరి లాహిరి లాహిరిలో...’. 
ఈ రోజు నుంచి ఈటీవీలో రోజూ రాత్రి 7 గంటలకి ప్రసారం కాబోతోంది.
ఓడలు, షిప్‌యార్డులు, పడవ పందేలు, భారీగా సాగే చేపల వ్యాపారాలు...వీటి నేపథ్యంలో ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలను హృద్యంగా చూపే ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ ధారావాహికను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ‘ఆర్కా మీడియా’ ఈటీవీ కోసం నిర్మిస్తోంది.
ప్రముఖ నటుడు ఆనంద్‌ తొలిసారి తెలుగు టీవీలో, అందులోనూ ఓ కీలకమైన పాత్రలో  నటిస్తున్నారు.
మరో ముఖ్యపాత్రలో నిళగల్‌ రవి, హీరోయిన్లుగా అత్యంత ఆకర్షణీయమైన పాత్రల్లో శోభాశెట్టి, సంజన నటిస్తున్నారు.
యువతరాన్ని, మహిళా లోకాన్ని అమితంగా  ఆకట్టుకునే ఈ ధారావాహిక గురించి విశేషాలు నటీనటుల మాటల్లోనే...
సినిమాలో నటిస్తున్నట్టే ఉంది
‘‘వ్యక్తిగతంగా మా కుటుంబంలో అమ్మాయిలే లేరు. మేం నలుగురు అన్నదమ్ములం. మా అందరికీ అబ్బాయిలే. నాకు ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. కానీ ‘వీళ్లు నా కూతుళ్లు, నా కోసం ఏమైనా చేస్తార’ంటూ ఇద్దరమ్మాయిలకి తండ్రిగా నరసింహ పాత్రలో నటించా. అదొక గొప్ప అనుభవం’’ అంటున్నారు ఆనంద్‌. సీనియర్‌ నటుడైన ఈయన ఇదివరకు కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం తెలుగు, తమిళం,  మలయాళ భాషల్లో సహాయ నటుడిగా కీలకమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో...’తో తొలిసారి తెలుగులో టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ ధారావాహిక గురించి, తన పాత్ర గురించి ఆనంద్‌ చెప్పిన విషయాలివీ...
‘‘తమిళంలో రెండు ధారావాహికలు చేశా. తెలుగు నుంచీ ఎప్పట్నుంచో అవకాశాలు వస్తున్నాయి. కానీ నేనే ఒప్పుకోలేదు. మేకింగ్‌ ఆలస్యమవుతుందనీ... కథలు ఎలా ఉంటాయో అని అటువైపు ఆసక్తి చూపించలేదు. అయితే ఆర్కా మీడియా నుంచి ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అవకాశం రాగానే మొదట కథ విందామనుకొన్నా. విన్నాక అచ్చం ఇదొక సినిమా కథలాగే అనిపించింది. ఆర్కా మీడియా ఈ ధారావాహికని తీయాలనుకొంటున్న విధానం, కథని మలిచిన తీరు నాకు నచ్చడంతో వెంటనే ఒప్పుకొన్నా. ఒక సినిమాలాగే తీస్తున్నారు. రోజూ 150 నుంచి 250 మందికిపైగా నటులు, సాంకేతిక బృందం సెట్‌లో ఉంటారు. అంత భారీగా తీస్తున్న ధారావాహిక ఇది. సినిమాలో నటిస్తున్నట్టే ఉంది’’.
‘‘తన ఇద్దరు కూతుళ్ల కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్న తండ్రి పాత్ర నాది. అతనికి ప్రేమ ఎంతో, కోపం కూడా అంతే. ముక్కుసూటి మనిషి. ఆ వ్యక్తిత్వం తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతని శత్రువులు ఎవరు? ఏం చేశారనేది ఆసక్తికరం. నటనకి అవకాశమున్న ఓ మంచి పాత్ర ఇది. అప్పుడప్పుడు నా పాత్రలో ప్రతినాయక ఛాయలు కూడా కనిపిస్తుంటాయి. మామూలుగా ధారావాహికలనగానే ఇంట్లో కుటుంబ ప్రేక్షకులు మాత్రమే చూస్తారనుకుంటాం. కానీ దీన్ని యువతరం కూడా ఇష్టపడుతుంది. బంధాలు, అనుబంధాలు, పగ, ప్రతీకారంతోపాటు... మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. మంచి డ్రామా పండింది’’.
‘‘మంచి కథల్నికానీ... నటీనటుల్ని కానీ ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేసే శక్తి     సామర్థ్యాలు టెలివిజన్‌కి ఉన్నాయి. ఒకేసారి కొన్ని కోట్ల మంది టీవీని చూస్తుంటారు. నేరుగా  ప్రేక్షకుల ఇళ్లలోకి వెళతాం. చాలాసార్లు చూస్తుంటాను కదా... ఎంత పెద్ద నటులైనా, పారితోషికం ఎంత తీసుకొంటున్నా, పక్కన టీవీ నటులు ఉన్నారంటే ప్రేక్షకులు వాళ్లనే బాగా గుర్తుపడతారు. అంత బలం టీవీకి ఉంటుంది. అందుకే టెలివిజన్‌ అంటే ఇష్టం. ‘లాహిరి లాహిరి లాహిరిలో..’తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి, వారి మనసుల్లోకి నేరుగా వెళుతున్నందుకు ఆనందంగా ఉంది’’.
‘‘తొలి సినిమాకి నా పారితోషికం రూ.2 వేలు. ఆ మొత్తం క్రమంగా రూ.20 లక్షల వరకు వెళ్లింది. 33 ఏళ్లుగా నటుడిగా నా ప్రయాణం కొనసాగుతోంది. ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు  ఉన్నట్టుగానే ఇందులోనూ ఉంటాయి. కథానాయకుడిగా నట ప్రయాణాన్ని ఎంతగా ఆస్వాదించానో, సహాయ నటుడిగా ఇప్పుడూ అంతే సంతృప్తితో ఉన్నా. ‘సైరా నరసింహారెడ్డి’, ‘డియర్‌ కామ్రేడ్‌’తో పాటు అల్లు శిరీష్‌ సినిమా, ‘సవ్యసాచి’ల్లోనూ నటిస్తున్నా’’.
నేను... నాన్న కూతురుని!
‘‘నాన్నకి ప్రతిబింబం నేను. నాన్న ఏది చేస్తే అది కరెక్ట్‌     అనుకొనే కూతురిని. ఆయనకి ఎంత ధైర్యమో, నాకూ అంతే. అలాంటి కూతురు కోసం నాన్న ఏం చేశాడు? నాన్న కోసం ఆ కూతురు ఏం చేసిందన్నది తెరపైనే చూడాలి’’ అంటోంది శోభాశెట్టి. బెంగుళూరు అమ్మాయి అయిన ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న ‘అత్తారింటికి దారేది’లో మెరిసింది. ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ ధారావాహికలో లహరిగా నటించింది. ఆ పాత్ర గురించి, ధారావాహిక గురించి శోభాశెట్టి చెబుతున్న విషయాలివీ...
‘‘నిజ జీవితాల్లో అమ్మాయిలకి నాన్నతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. నేను నాన్న కూతురిని అని చెప్పుకొంటుంటారు. ఇందులో లహరి అలాంటి అమ్మాయే. వంద మంది ఎదురుగా వచ్చినా ధైర్యంగా సమాధానం చెబుతుంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. అదంతా నాన్నని చూసే. అలాంటి లహరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లని ఎదుర్కొందన్నది ఆసక్తికరం. తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు... మన జీవితాల్లోని పలు కోణాల్ని స్పృశించే కథ ఇది. ఈ కథ, పాత్రలు వినగానే తప్పనిసరిగా నటించాల్సిన ధారా వాహిక అనిపించింది. ‘అత్తారింటికి దారేది’తో పాటు, తెలుగులో మరో ధారావాహిక కూడా చేశా. ఇది వాటికి భిన్నంగా సాగుతుంది’’.
‘‘నిజ జీవితంలో నేను అంత ధైర్యమున్న అమ్మాయిని కాదు. నాన్న ఎప్పుడూ నాతోనే ఉన్నప్పటికీ... అమ్మతోనే అనుబంధం ఎక్కువ. ఆ రకంగా చూస్తే నా వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్రని పోషించానన్నమాట. ఇందులో నటిస్తున్నప్పుడు నా నిజ జీవితాన్ని అస్సలు ఊహించుకోలేదు. సెట్‌లో నేను లహరిని, నరసింహ కూతురిని. దర్శకుడు, తోటి నటీనటులు కూడా అక్కడ నన్ను లహరి పేరుతోనే పిలుస్తుంటారు. మొదట ఈ అవకాశం గురించి ఆర్కా మీడియా నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. చాలా సంతోషించా. నీకు తండ్రిగా ఓ సీనియర్‌ నటుడు చేస్తున్నాడని చెప్పారు. అప్పుడు కాస్త భయపడ్డా. అంత పెద్ద నటులతో పని చేయడం ఎలా ఉంటుందో అనుకొన్నా. కానీ నటుడు ఆనంద్‌ చాలా మంచి వ్యక్తి. సెట్‌లో ఎంతగానో ప్రోత్సహిస్తుంటారు. ఒక సీనియర్‌తో పనిచేశానన్న ఫీలింగ్‌ ఎప్పుడూ రాలేదు. నాకు చెల్లెలిగా సంజన అనే అమ్మాయి చేసింది. ఆమెది కూడా బెంగళూరు. మేం ఒకరికొకరు ముందే తెలుసు, మళ్లీ కలిసి పనిచేయడం చాలా బాగుంది’’.
‘‘ధారావాహిక అనగానే కుటుంబమే గుర్తుకొస్తుంది. మన జీవితాల్లో ఏం జరుగుతుందో అదే చూపిస్తుంటారు. టీవీతో మేం కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాం. ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ తరహా ధారావాహికలతో కుటుంబంలో ఒకరిగా మారిపోతామనే నమ్మకముంది. ఇందులో నా పాత్ర కంటతడి పెట్టిస్తుంది. మన చుట్టూ జీవితాల్ని ప్రతిబింబించే కథ కాబట్టి మరింత లీనమై నటించా. దర్శకుడు జై వల్లే తెలుగు భాషని చాలా వేగంగా నేర్చుకొన్నా. ఇప్పటికే ముప్పై రోజులు చిత్రీకరణలో పాల్గొన్నా. ముప్పయ్యేళ్ల అనుభవం వచ్చినంత అనుభూతి కలిగింది’’.

Post a Comment

0 Comments